మహేశ్.. నారీ నారీ నడుమ మురారి?
on Apr 19, 2021
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పటివరకు 26 చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న `సర్కారు వారి పాట` 27వ సినిమా. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఫస్ట్ ఫిల్మ్ `రాజకుమారుడు` నుంచి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ `సర్కారు వారి పాట` వరకు మహేశ్ ఎక్కువగా సింగిల్ హీరోయిన్ ఉన్న సినిమాల్లోనే సందడి చేశారు. `యువరాజు`, `వంశీ`, `టక్కరిదొంగ`, `బ్రహ్మోత్సవం` మాత్రమే ఇద్దరు లేదా అంతకుమించి నాయికలతో తెరకెక్కిన సినిమాలు.
కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం మహేశ్.. మరోమారు నారీ నారీ నడుమ మురారి తరహా పాత్రలో దర్శనమివ్వనున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో `అతడు`, `ఖలేజా` తరువాత మహేశ్ మరో చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు కథానాయికలకు స్థానముందట. వారిలో ఒకరిగా పూజా హెగ్డే నటించబోతోందని సమాచారం. ఇంకో హీరోయిన్ ఎవరన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తమ్మీద.. మహేశ్ తో తీసిన గత రెండు చిత్రాలు `అతడు`, `ఖలేజా`లో సింగిల్ హీరోయిన్ తోనే సరిపెట్టిన త్రివిక్రమ్.. ఈ సారి ఇద్దరు నాయికల కథతో రాబోతుండడం విశేషమనే చెప్పాలి. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
మే నెలాఖరులో సెట్స్ పైకి వెళ్ళనున్న మహేశ్ - త్రివిక్రమ్ కాంబో మూవీ.. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ అయ్యే అవకాశముంది.